
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మడావి హిడ్మా. ఇటీవల హిడ్మా పేరుతో ఓ ఏరియా కమిటీ సభ్యుడు లొంగిపోతే ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పీఎల్జీఏ కంపెనీ వన్ కమాండర్గా ఉన్న హిడ్మాకు సంబంధించిన కీలక సమాచారం భద్రతా దళాలకు చిక్కినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం ఎక్కడ పాగా వేశాడో తెలియరాకున్నా దాదాపు 20 ఏళ్ల తర్వాత హిడ్మాకు సంబంధించిన తాజా ఫొటోగా పేర్కొంటున్న చిత్రం శుక్రవారం వెలుగుచూడడం గమనార్హం.
అత్యంత రహస్యం
మడావి హిడ్మాకు మూడంచెల భద్రతావ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీమ్లో 10–12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బీ టీమ్లో 20–22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దళం/కంపెనీలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని, ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని చెబుతారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం ఇద్దరు సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంప్ వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా, ప్రత్యేక క్యాంపులో ఉంటాడు. హిడ్మాను ఎవరైనా కలవాలంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆరు నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలిసింది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా, పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1కి కమాండర్గా ఉన్నాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజినల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది.
జిరామ్ఘాటీతో
సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతోపాటు హిడ్మా కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెలరోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపుదాడికి దిగారు. హెలికాప్టర్ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు జరిపారు.
ఆయన మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజులు నెలకొన్న ఉత్కంఠ హిడ్మా అంటే హడల్ అనే విధంగా మారింది. దీంతో భద్రతాదళాలు హిడ్మాపై కూపీ లాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలో అంబూష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతాదళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డీఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతాదళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.
కిషన్జీ, చలపతి అడుగుజాడల్లో
హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాల ను నరనరాన ఒంట బట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ ఏ ఫర్ ఆరమ్స్, బీ ఫర్ బెంగాల్, సీ ఫర్ చారు మంజుదార్ అన్నట్టుగా కిషన్ జీ ఆలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నార్ –టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ అంబూష్దాడిలో 76 మంది సీర్ఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు.