పిడుగొస్తే.. ఏం చేయాలి? | whats is lightning and how to stay safe from thunderstorm: telangana | Sakshi
Sakshi News home page

పిడుగొస్తే.. ఏం చేయాలి?

Jul 22 2024 2:50 AM | Updated on Jul 22 2024 2:50 AM

whats is lightning and how to stay safe from thunderstorm: telangana

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8,060 మరణాలు సంభవిస్తే.. అందులో 2,887 మరణాలకు పిడుగుపాటే కారణం.

ప్రతి సెకనుకు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడతాయట.
‘వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియవ’న్నది సామెత. కానీ దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగు పాటును మాత్రం ముందే గుర్తించేందుకు చాన్స్‌ ఉంటుంది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే.. ఉరుములు, మెరుపులు వస్తుంటే.. చాలా మంది ఏ చెట్టు కిందకో పరుగెడుతుంటారు.

అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకు దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రైతులు, చిన్నారులు సహా పదుల సంఖ్యలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..

పిడుగుపాటు బారిన పడకుండా..

‘దామిని’ ఉంటే తప్పించుకోవచ్చు! 
పిడుగులకు సంబంధించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘దామిని’అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. మీరు ఉన్న ఏ ప్రాంతంలోనైనా తర్వాతి 15 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉంటే ఈ యాప్‌ హెచ్చరిస్తుంది. పుణేకు చెందిన ఐఐటీఎం సంస్థ దీన్ని రూపొందించింది.

జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా.. మీరున్న చోటేకాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశముందో చెప్తుంది. అంతేకాదు.. గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగుపడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్తుంది. పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ శాఖ దగ్గర కూడా ఉంది.    – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement