
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల దుర్మరణం
ఘట్కేసర్(హైదరాబాద్): ఓ ఐటీ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరారు ఆ యువకులు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో ఉత్సాహంగా పార్టీ చేసుకునేందుకు శుక్రవారం సాయంత్రం ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్లోని విహారి నెస్ట్ ఫాంహౌస్కు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చి మిగతా స్నేహితులతో కలిసి రెండు కార్లలో ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును చూసేందుకు వెళ్లారు. తిరిగి ఫాంహౌస్కు చేరుకునే క్రమంలో ఓ కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన మేరకు గచి్చ»ౌలిలోని అసెన్షన్ ఐటీ కంపెనీలో పనిచేసే మిత్రులు కుంట్లూరుకు చెందిన భార్గవ్యాదవ్ (23), సైనిక్పురికి చెందిన వర్షిత్ (22), పటాన్చెరుకు చెందిన దినేశ్ (22), అల్వాల్కు చెందిన ప్రవీణ్ (30) నలుగురు ఒక కారులో, మరొక కారులో మరో నలుగురు కలిసి మొత్తం ఎనిమిది మంది శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఫౌహౌంస్కు చేరుకున్నారు. రాత్రి వరకు విందు చేసుకొని అర్థరాత్రి దాటిన తర్వాత కారులో బయటకు వచ్చి లక్ష్మీనారాయణ చెరువు తిలకించారు. తిరిగిఫాంహౌస్కు చేరుకునే క్రమంలో కిలోమీటర్కు ముందే రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.
ఈ సంఘటనలో రెండు స్తంభాలు విరిగిపోయాయి. వెనక కూర్చున్న భార్గవ్, వర్షిత్ బెల్ట్ పెట్టుకోకపోవండతో కారు డోర్లు తెరుచుకొని రోడ్డుపై పడి అక్కడికక్కడే మృంతిచెందారు. కారులో ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న దినేశ్కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ వైపు నుంచి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నడుపుతున్న ప్రవీణ్కు తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు వెనకాల మరో కారులో ఉన్న స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ప్రవీణ్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అనుమతి లేకుడా మద్యం?
కాగా ఫాంహౌస్లో యువకులు మద్యం సేవించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఫాంహౌస్లలో అనుమతి లేకుండానే మందు పార్టీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు∙జరిగి మరణాలు సంభవిస్తున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.