సాక్షి, హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు ఆధారంగా తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు కాగా.. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.
అకాడమీలోనే (SVPNPA) మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆదివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల తర్వాతే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
సంచలన ఆరోపణలు
కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో పలు తీవ్ర ఆరోపణలు చేశారు. గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపేవారని, తోటి ట్రైనీ అధికారుల ముందు తనను కించపరిచేలా మాట్లాడేవారని ఆరోపించారు. తనకు మరో అధికారితో సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ.. దాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఫోన్ను బలవంతంగా తీసుకుని మెసేజ్లు పరిశీలించేవారని, పాస్వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించారు.
గదిలోకి లాక్కెళ్లి దాడి చేశారని ఆరోపణ
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన తనను గదికి తీసుకెళ్లి ఫోన్ పాస్వర్డ్ అడిగి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అలాగే జూలై 9న తనను జుట్టు పట్టుకుని గదిలోకి లాక్కెళ్లారని, మెడపై కత్తి పెట్టి బెదిరించారని, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో కండోమ్ ప్యాకెట్లు విసిరారని, అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరుసటి రోజు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్!
తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేశారని మహిళా అధికారి ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66E, 67A కింద కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అసభ్యకర కంటెంట్ ప్రసారం వంటి అంశాలు ఉన్నాయి.
కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగింపు
మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ రికార్డులు, వాంగ్మూలాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఉన్నాయని, వాటి వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆత్మహత్యాయత్నంతో కేసులో కొత్త మలుపు
ఇదిలా ఉండగా.. కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన తప్పు లేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు సమాచారం. లైంగిక వేధింపులు అవాస్తవమని, చట్టంపై నమ్మకముంది.. న్యాయం గెలిచి తీరుతుంది అని ఇన్స్టాగ్రామ్లోనూ మరో పోస్టులో ఉదయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన తీవ్ర ఆరోపణలు.. మరోవైపు కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సిటీ పోలీసుల ప్రకటన
ఉదయ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అమీర్పేట లీలా నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉదయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది అతని స్నేహితురాలి నివాసంగా నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు అయ్యాక కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 ప్రాంతంలో ఎస్సార్నగర్లోని ఓ ఆస్పత్రికి అతన్ని తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు వెల్లడించారు.
ఉదయ్ సస్పెన్షన్
మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అకాడమీ అధికారులు చర్యలు తీసుకోగా.. తదుపరి నిర్ణయం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) పరిధిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.


