
నేటి నుంచి మొదలు.. ఆగస్టు 23తో పూర్తి
ఈసారి కొత్తగా మాక్ కౌన్సెలింగ్
కౌన్సెలింగ్కు 176 ఇంజనీరింగ్ కాలేజీలు
కొత్తగా పాలమూరు, శాతవాహన,హెల్త్ సైన్సెస్
షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది. శనివారం నుంచే విద్యార్థులు ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. 3 విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు23 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ శుక్రవారం మండలి కార్యాలయంలో సమావేశమైంది. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ప్రొ. ఎస్కే మహమ్మూద్, మండలి కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి, రిజి్రస్టార్ ప్రొ. వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు.
176 కాలేజీల్లో ప్రవేశాలు: రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు చెందిన కాలేజీలు 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్లో పాల్గొన్నాయి. ఈ ఏడాది రెండు ప్రైవేటు కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, కొత్తగా పాలమూరు, శాతవాహన, కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. ఈ లెక్కన ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 176 కాలేజీలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో పాల్గొంటాయి.

గత సంవత్సరం కన్వినర్ కోటా కింద 89,970 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త యూనివర్సిటీలు రావడంతో ఈసారి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 6వ తేదీ నాటికి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాతోపాటు, అందులో సీట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2022లో నిర్ణయించిన ఫీజులే ఈ ఏడాది కూడా వసూలు చేయాలని ఇప్పటివరకు నిర్ణయం జరిగిందని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈసారి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జోసా కౌన్సెలింగ్ తరహాలో మౌక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.