
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్కు ఉరి శిక్ష విధించింది.
2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.
అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
