హైడ్రా రంగనాథ్‌కు బిగ్‌ షాక్‌ | Telangana High Court Serious On HYDRA Ranganath | Sakshi
Sakshi News home page

హైడ్రా రంగనాథ్‌కు బిగ్‌ షాక్‌

Jun 13 2026 10:49 AM | Updated on Jun 13 2026 10:54 AM

Telangana High Court Serious On HYDRA Ranganath

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒక వివాదాస్పద స్థలంపై ​కోర్టు ఉత్తర్వులున్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో స్థలం విషయమై కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50వేల జరిమానా విధించింది.

వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సర్వే నెంబర్‌-45లో 2 ఎకరాల వివాదాస్పద భూమిపై ఉంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థలం విషయంలో హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో, విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

అలాగే, తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. దీంతో, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం, కమిషనర్ రంగనాథ్‌పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది. ​తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించింది. దీంతో, జరిమానా విషయం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement