ప్రజలెవరూ కోర్టులను తప్పుదోవ పట్టించరు
తహసీల్దార్ ఉత్తర్వులివ్వకున్నా ఏకపక్షంగా కూల్చివేతలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేరు... నోటీసులు లేకుండా కూల్చివేస్తామంటే కోర్టులు చూస్తూ కూర్చోవు
ఈ కేసు ముగిసే వరకు తహసీల్దార్ ప్రతీ విచారణకు రావాల్సిందే... కొండాపూర్ కూల్చివేతలపై హైకోర్టు
కోర్టులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారనేందుకు ఈ కేసే నిదర్శనం. అది చేస్తోంది.. ప్రజలు కాదు. వాస్తవానికి తప్పుదారి పట్టిస్తోంది కొందరు ప్రభుత్వ అధికారులే. శాఖల మధ్య సమన్వయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై ఇటీవల మరో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయమే. ఆయన అత్యుత్సాహంపై చేసిన వ్యాఖ్యలు కూడా సబబే –హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ప్రజలెవరూ కోర్టును తప్పుదోవ పట్టించ డం లేదని, కొందరు అధికారులే ఆ పని చేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చే సింది. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లో కూల్చివేతలే దీని కి నిదర్శనమని తేల్చిచెప్పింది. తహసీల్దార్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకున్నా.. చేశారంటూ హైడ్రా ఆగమేఘాలపై వెళ్లి చట్ట విధానాన్ని అనుసరించకుండా కూల్చివేతలు చేపట్టడం సహించరానిదని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థను పక్కకు పెట్టి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామంటే రాజ్యాంగ న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హైడ్రా కమిషనర్ను హెచ్చరించింది.
ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం రాజ్యాంగ విధి అని, అందుకు న్యాయస్థానాలను నిందించడం సరికాదని పేర్కొంది. ఈ కేసు ముగిసేవరకు ప్రతీ విచారణకు తహసీల్దార్ హాజరు కావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసింది. కొండాపూర్లోని తమ ప్రైవేట్ స్థలంలో హైడ్రా అక్రమంగా జోక్యం చేసుకుని ప్రహరీ, వాచ్మన్ గదిని కూల్చివేశారంటూ పి.సుధారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు.
ఒక సర్వే నంబర్కు బదులు మరోటి
గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ విచారణకు హాజరయ్యారు. కూల్చివేతకు సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. తమ కార్యాలయం రాసిన లేఖ సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమికి సంబంధించినది మాత్రమేనని తెలిపారు. పిటిషనర్ స్థలం సర్వే నంబర్ 60లోని ప్రైవేటు భూమిలోనే ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని వివరించారు. దీంతో హైడ్రా అధికారులు సర్వే నంబర్ 60లోని ప్రైవేటు స్థలాన్ని.. సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమిగా ఎలా గుర్తించారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కూల్చివేతకు ముందు అసలు సర్వే నిర్వహించారా? రికార్డులు పరిశీలించారా? అని నిలదీశారు. 2025, అక్టోబర్ 1న తహసీల్దార్ లేఖ పంపగా, దాని ఆధారంగా అక్టోబర్ 4న కూల్చివేత చేపట్టామని హైడ్రా తరఫు న్యాయవాది చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ... జిల్లా కలెక్టర్ నుంచి కూల్చివేతకు ఏదైనా స్పష్టమైన ఆదేశం వచి్చందా.. అంత తొందరగా కూల్చివేత చేపట్టాల్సిన అత్యవసరం ఏమిటి.. సాధారణంగా ఏదైనా వివాదంలో భూమి ప్రభుత్వానిదేనని అనుకున్నా, ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసు ఇవ్వాలి కదా.. వారి వాదనలకు అవకాశం కల్పించాలి కదా.. మీపై బయట నుంచి ఎవరైనా ఒత్తిడి చేశారా.. అని వరుస ప్రశ్నలు సంధించారు.
కోర్టు ఆదేశాలకు గౌరవం ఏదీ?
ఈ కోర్టే గతంలో చట్ట ప్రక్రియను అనుసరించాలని స్పష్టంగా ఆదేశించిందని న్యాయమూర్తి చెప్పారు. అలాంటప్పుడు తెలంగాణ భూఆక్రమణ చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారశైలిపై ఇటీవల మరో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమరి్థస్తున్నామన్నారు. జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ధర్మాసనం రంగనాథ్ అత్యుత్సాహంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సబబేనన్నారు. ‘ఆయనకు నచి్చనట్లు వ్యవహరిస్తున్నారు.. చట్ట ప్రక్రియ పాటించకుండా కూల్చివేతలు చేస్తున్నారు.. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. రికార్డులు సరిచూసుకోవడం లేదు.. సర్వే చేయడం లేదు.. కోర్టు ఆదేశాలకు గౌరవం ఇవ్వడం లేదు’అంటూ జస్టిస్ శ్రవణ్కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతివాదులు సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.


