సమగ్ర కులగణనకు సై! | Sakshi
Sakshi News home page

సమగ్ర కులగణనకు సై!

Published Sat, Mar 16 2024 5:22 AM

Telangana GO issues MS 26 for comprehensive caste census: Burra Venkatesham - Sakshi

ఉత్తర్వులు జారీ... త్వరలో విధివిధానాలు

సాక్షి, హైదరాబాద్‌:  సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయాల్లో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్ర కులగణనకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సమగ్ర కులగణనకు సంబంధించిన జీఓ ఎంఎస్‌ 26ను జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించనున్నారు.

నిర్వహణకు రూ.150 కోట్లు...: ఈ సర్వే చేపట్టేందుకు కనీసంగా రూ.150కోట్లు బడ్జెట్‌ అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సర్వే ఖర్చు కోసం నిధులను 2024–25 వార్షిక బడ్జెట్‌లో కేటాయించింది. ఈమేరకు తాజా ఉత్తర్వుల్లో బడ్జెట్‌ అంశాన్ని పొందుపర్చింది. సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉత్తర్వుల్లో వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తారు.

జీఓ విడుదల హర్షణీయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్‌
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమగ్ర కులగణన జీఓ విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలను సేకరింంచేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement