నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం | Telangana: BRS team to visit Medigadda on march 01 | Sakshi
Sakshi News home page

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

Mar 1 2024 4:45 AM | Updated on Mar 1 2024 2:19 PM

Telangana: BRS team to visit Medigadda on march 01 - Sakshi

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 200 మంది ప్రతినిధులు

అన్నారం వద్ద కాళేశ్వరంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌  

సాక్షి, హైదరాబాద్‌/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శిస్తుంది. ఉదయం 8.30కు తెలంగాణ భవన్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరే ఈ బృందం నేరుగా భూపాలపల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజనం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఒక బ్లాక్‌లో పిల్లర్లకు ఏర్పడిన పగుళ్లతో పాటు రోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న తీరును పరిశీలిస్తుంది. మేడిగడ్డ సందర్శన అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం బ్యారేజీని కూడా ఈ బృందం సందర్శిస్తుంది.

అన్నారం బ్యా రేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన్‌ ఇస్తారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్టు స్థితిగతులను మీడియా కు వివరిస్తారు. బీఆర్‌ఎస్‌ బృందంతో కొందరు సాగునీటిరంగ నిపుణులు కూడా మేడిగడ్డను సంద ర్శిస్తారు. త్వరలో మరికొందరు నిపుణులు కూడా వి.ప్రకాశ్‌ నేతృత్వంలో సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్టీ స్తారు.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులో లోపాలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన ద్వారా వాస్తవాలను వెల్లడిస్తామని బీఆర్‌ఎస్‌ చెప్తోంది. ఓ వైపు దెబ్బతిన్న బ్యారేజీకి మరమ్మతులు చేస్తూనే మరోవైపు కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నీటిని ఎత్తిపోయొచ్చని బీఆర్‌ఎస్‌ చెప్తోంది. మేడిగడ్డ మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు నేరుగా, సోషల్‌ మీడియా ద్వారా వివరిస్తామని చెప్తోంది. 

తొలిసారి కేటీఆర్‌ రాక.. 
2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి మంత్రి హరీశ్‌రావు ప దుల సార్లు వచ్చి పనులను పరిశీలించారు. కానీ కేటీఆర్‌ రాలేదు. ప్రస్తుతం బ్యారేజీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా కేటీఆర్‌ బ్యారేజీ వద్దకు రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement