సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ గంట మోగించగానే చర్చ మొదలవుతోంది. కానీ ఆ గంట మోగడం వెనుక ప్రతి గంటకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఎన్జీవో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాసనసభ నడవాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది.
250 మంది అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, 300 మంది పోలీసులు, శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అసెంబ్లీకి వస్తారు. వారందరికీ ఓవర్ టైం అలవెన్స్, భోజనం, రవాణా ఖర్చు ప్రభుత్వానిదే. దీనికితోడు అసెంబ్లీ హాల్లో ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్, వాటి నిర్వహణ సిబ్బంది, క్యాంటీన్, కాగితాల ముద్రణ ఖర్చులు అదనం. ఇవి కాకుండా సభ జరిగే రోజున ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రోజువారీ భత్యం రూ. 2,000, ప్రయాణ భత్యం, హైదరాబాద్లో ఉచిత బంగ్లా, కారు, ఇద్దరు పీఏల జీతాలను ప్రభుత్వమే భరిస్తుంది.
సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ మాత్రం సభకు వస్తేనే లభిస్తుంది. ఇలా అన్నీ కలిపితే కేవలం ఒక రోజుపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లెక్కన) రాష్ట్ర శాసనసభ నిర్వహణకు దాదాపు రూ. కోటి నుంచి రూ.కోటిన్నర దాకా ఖర్చవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్కే రూ. 13.59 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగిందని పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది.
ఇదీ చదవండి :కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?


