Hyderabad: Three New High Court Judges Take Oath - Sakshi
Sakshi News home page

కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Aug 1 2023 1:39 AM | Updated on Aug 1 2023 7:52 PM

Swearing in of new judges - Sakshi

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, ఇతర న్యాయమూర్తులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్‌ కళాసికం సుజన, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ జూకంటి అనిల్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్‌ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్‌ కుమార్‌లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. 

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...
సోమవారం సాయంత్రం తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్‌ సుజన, జస్టిస్‌ లక్ష్మీనారాయణ, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement