స్కిన్ షో నుంచి స్కిల్‌ షోగా.. | The style of Miss World competitions has completely changed | Sakshi
Sakshi News home page

స్కిన్ షో నుంచి స్కిల్‌ షోగా..

May 8 2025 4:06 AM | Updated on May 8 2025 5:20 AM

The style of Miss World competitions has completely changed

పూర్తిగా మారిన మిస్‌ వరల్డ్‌ పోటీల తీరు 

ఆటల పోటీలు, మేధో మ«థనం, సామాజిక సేవా ఇతివృత్తానికి ప్రాధాన్యం 

హైదరాబాద్‌లో పోటీల సందర్భంగా మరిన్ని జాగ్రత్తలు  

సామాజిక సేవలో స్వయంగా మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ మమేకం 

పలు దేశాల్లో నిరుపేదలకు ఇళ్లు, మురికివాడల్లో స్కూళ్లు తదితర సేవలు 

తాజాగా భారత్‌లో సేవా కార్యక్రమాలకు యోచన

బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ (ఓ ప్రయోజనంతో కూడిన సౌందర్యం).. హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి నిర్వాహకులు పదేపదే చెబుతున్న మాట. ఎక్కడా అందాల పోటీలు అనే మాటే లేదు. 1951లో యూకేలో ఎరిక్‌ మోర్లే మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభించినప్పుడు కేవలం శరీర సౌందర్యాన్ని ప్రదర్శించటానికే అవి పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు అదే పంథా కొనసాగగా, ఇప్పుడు పోటీల తీరు సమూలంగా మారిపోయింది. పోటీదారులను అన్నివిధాలా పరిశీలించే, పరీక్షించే విధానం వచ్చింది.

ఇక సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే మన దేశంలో పోటీలనేసరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది ముంబైలో నిర్వహించినప్పుడు ‘ఒళ్లు’దగ్గర పెట్టుకుని వ్యవహరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం. ‘అందమే’ప్రదాన అంశంగా ఉన్నా.. అది అంతర్లీనంగా మాత్రమే ఉండేలా చూస్తున్నారు. సామాజిక బాధ్యత, మహిళా సాధికారత, వ్యక్తిగత ప్రతిభలే ప్రధాన అంశాలుగా పోటీలకు రూపకల్పన చేశారు. -సాక్షి, హైదరాబాద్‌

ఇప్పుడు ప్రతిభకే పట్టం..
బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యం అనే అంశం జనంలోకి వెళ్లేలా ఇప్పుడు కార్యక్రమాలను డిజైన్‌ చేశారు. పోటీదారులు సృజనాత్మక, కళాత్మక నైపుణ్యాలను, సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ప్రధాన రౌండ్‌ను రూపొందించారు. టాలెంట్‌ షోలో నృత్యం, గానం, వాయిద్య ప్రదర్శన, నాటకం, కవిత్వం, ఇతర సృజనాత్మక కళలు చేర్చారు. మే 22న శిల్పకళా వేదికలో మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలే నిర్వహిస్తున్నారు. దాదాపు 115 మంది పోటీదారులు వివిధ కళల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. దీనితో పాటు వారి మేధో సంపత్తి, ప్రపంచ విషయాలపై పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు.  

1996 ప్రపంచ సుందరి పోటీలు
వేదిక: బెంగళూరు 
‘మహిళను అంగడి బొమ్మగా చూపే పోటీలు వద్దు.. మహిళంటే శరీర ప్రదర్శన కాదు..’అంటూ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీసులు అడ్డుకునే సమయంలో కొందరు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు చనిపోయారు. ఈ ఘటనలు పోటీలపై పెద్ద దుమారమే రేపాయి. చివరకు భారీ సంఖ్యలో పోలీసు పహారా ఏర్పాటు చేసి పోటీలను నిర్వహించాల్సి వచ్చింది.  

2025 ప్రపంచ సుందరి పోటీలు
వేదిక: హైదరాబాద్‌
అక్కడక్కడా కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు తప్ప, ఎక్కడా నిరసన ప్రదర్శనలు లేవు. పైగా ఈ పోటీలు రాష్ట్రానికి మేలు చేస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. అందాల పోటీల నిర్వహణ తీరులో వచ్చినమార్పే... ప్రజల ఆలోచన విధానంలో ఇలాంటి మార్పు తీసుకొచ్చిoది. ఆ పోటీలు వద్దేవద్దు అన్న తీరు నుంచి, వాటిని ఓ వేడుకలాగా నిర్వహించే స్థాయికి చేరింది.

స్పోర్ట్స్‌ చాలెంజ్‌..  
అందం కంటే ఆరోగ్యం ముఖ్యమన్న సంకేతం ఇస్తూ ఈ రౌండ్‌ను డిజైన్‌ చేశారు. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి, అది సమకూరాలంటే ఆటలు ఆడగలగాలి, ఈ ఆటల్లో ముందున్న పోటీదారులు మంచి మార్కులు తమ ఖాతాలో వేసుకుంటారు. ఆటలతో పాటు నాయకత్వ లక్షణమనే మరో కీలక విషయాన్ని ఇందులో ప్రదర్శించాల్సి ఉంటుంది. 

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఇది ప్రేరణగా నిలు స్తుందని మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చెబుతోంది. స్పోర్ట్స్‌ చాలెంజ్‌లో రన్నిoగ్, రిలే రేస్‌లు, ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు ఉంటాయి. మే 17న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ ఫినాలే పోటీలు జరగనున్నాయి. 

సామాజిక సేవా కార్యక్రమాలు.. 
మిస్‌ వరల్డ్‌ సంస్థ ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌‘ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. పోటీదారులు తమ దేశాలలో సామాజిక సమస్యలపై తాము చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. రొమ్ము క్యాన్సర్‌పై సమాజంలో అవగాహన కల్పించటమే కాకుండా, బాధిత పేద మహిళలకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్‌ను పోటీల వేదికపై ఘనంగా సన్మానించేందుకు మిస్‌వరల్డ్‌ లిమిటెడ్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

సామాజిక సేవలో మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ 
మహిళల అందాన్ని ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శను దూరం చేసుకునేందుకు మిస్‌ వరల్డ్‌ సంస్థ గట్టిగా కృషి చేస్తోంది. ప్రస్తుతం దానికి చైర్‌ పర్సన్‌గా ఉన్న 86 ఏళ్ల జూలియా మార్లే ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ దాదాపు 100 దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, యుద్ధ బాధితులకు చేయూత, విపత్తు నివారణ, ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంక్షేమం, బాలికా విద్య వంటి అంశాలు వీటిల్లో ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోని పేద దేశాలలో విద్యా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటి సరఫరా వంటి ప్రాజెక్టులు చేపట్టింది. నైజీరియా, ఘనా, బంగ్లాదేశ్, నేపాల్‌ వంటి దేశాలలో సేవలందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement