ఫీజు బకాయిలపై విచారణ
6కు వాయిదా వేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫీజు వసూలు, రీయింబర్స్మెంట్కు సంబంధించి జీవో నంబర్ 9లోని నాలుగు మార్గదర్శకాలపై ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగించింది. వచ్చే సోమవారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. మంగళవారం కౌంటర్ దాఖలు చేస్తామని, అందరికీ కాపీ ఇవ్వడానికి ఈనెల 6 వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కాలేజీల తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి సమ్మతించిన న్యాయమూర్తి.. మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే సోమవారంలోగా రిప్లై కౌంటర్ వేయాలని కాలేజీలను ఆదేశించారు. అలాగే ఫీజుల నిర్ధారణ అంశాన్ని కాలేజీల న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆ పిటిషన్లపై కూడా విచారణ చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ 100కుపైగా కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తామని స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి చెప్పారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ఎస్.శ్రీరామ్, అవినాశ్ దేశాయ్, తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇన్ని రోజులు సమయం తీసుకుందన్నారు.


