
పార్టీ నాయకులు, శ్రేణులకు కేటీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: హైడ్రా బాధితులకు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, లీగల్ సెల్ అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రకటించారు. తమ గోడు వినిపించేందుకు తెలంగాణ భవన్కు వస్తున్న బాధితులకు అండగా నిలవాలని పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు.
శనివారం పెద్దఎత్తున హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు తరలివచ్చిన విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గడిచిన రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందున రాలేకపోతున్నట్లు ‘ఎక్స్’ద్వారా పేర్కొన్నారు. గురువారం రాత్రి నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
రేవంత్ శాఖలో అవినీతి ఘనులు!
నకిలీ డాక్యుమెంట్లు రసీదులు పుట్టించిన కొందరు అక్రమార్కులు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) నుంచి రూ.150 కోట్లు విలువవేసే 1.50 లక్షల టన్నుల ఇసుకను దోచారని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను కొందరు ఇంటి దొంగలు దారిమళ్లించారన్నారు. సాక్షాత్తూ రేవంత్రెడ్డి అదీనంలో ఉన్న శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.