నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు! | Separate Barrack Has Been Allocated For Aghori In Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!

Apr 25 2025 5:33 PM | Updated on Apr 25 2025 6:42 PM

Separate Barrack Has Been Allocated For Aghori In Chanchalguda Jail

సాక్షి, హైదరాబాద్‌: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్‌చల్‌ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

కాగా, చంచల్‌ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్‌ను పరిశీలించారు. అఘోరీ అలియాస్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్‌లో ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్‌ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్‌ హోమ్‌కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..
పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్‌ఎస్‌ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్‌ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ జడ్జి ధీరజ్‌కుమార్‌ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్‌(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్‌లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement