రౌడీషీటర్ దారుణ హత్య దారుణ హత్య

 Rowdy Sheeter Brutal Murder In Rajendranagar  - Sakshi

హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నందున పోలీసులకు లొంగిపోవాలని సూచించినందుకు ఓ రౌడీషీటర్‌ను మరో రౌడీషీటర్‌ కత్తులతో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన టార్గెట్‌లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన అనంతరం లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్‌ విసిరాడు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌ డైరీఫామ్‌ ప్రాంతానికి చెందిన ఖూనీ గౌస్‌  రౌడీషీటర్. ఇతనిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీలు, భయబ్రాంతులకు గురి చేయడం తదితర కేసులు నమోదై ఉన్నాయి.

 గతంలో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన ఖూనీ గౌస్‌ గత నెలలో బయటికి వచ్చాడు. బయటికి వచి్చన అనంతరం తన గ్యాంగ్‌తో పాత సామ్రాజ్యాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి ఐదు రోజుల క్రితం అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డైరీఫామ్‌ వద్ద పాలను విక్రయించే ఓ వ్యక్తి దుకాణంపై దాడి చేశాడు. షాపును పట్టపగలే తగులబెట్టాడు. అడ్డొచ్చిన వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. 

కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్‌ పోలీసులు..నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా..రాజేంద్రనగర్‌కు చెందిన మరో  రౌడీషీటర్ సర్వర్‌ (30) ఇటీవల ఖూనీ గౌస్‌ను కలిసి గొడవలు వద్దని, పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. దీంతో ఖూనీ గౌస్‌ శుక్రవారం రాత్రి కలుద్దామంటూ సర్వర్‌కు తెలిపాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సర్వర్‌కు ఫోన్‌ చేసి జనప్రియ వెంచర్‌ ప్రాంతంలోని మొండి ఖత్వా ప్రాంతానికి రావాలని తెలిపాడు. 

సర్వర్‌ అక్కడికి వెళ్లగానే.. తననే పోలీసులకు లొంగిపోమంటావా...అంటూ కత్తులతో విక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సర్వర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడే ఉన్న ఇతర స్నేహితులతో ‘మరో ఇద్దరు తన టార్గెట్‌ అని..వారిని చంపిన అనంతరం పోలీసులకు లొంగిపోతానని’ తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  

అప్పుడే అరెస్టు చేసి ఉంటే... 
ఐదు రోజుల క్రితం డైరీఫామ్‌ వద్ద జరిగిన దాడిలో నిందితుడైన ఖూనీ గౌస్‌ను అరెస్ట్‌ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింద ని ఆరోపించారు. ఖూనీ గౌస్‌ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తాడని... గతంలో అత్తాపూర్, రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పీడీ యాక్ట్‌ అనంతరం జైలు నుంచి విడుదలైన ఖూనీ గౌస్‌పై నిఘా లేకపోవడంతో ఈ సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో వెంట నే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top