
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య పరిశోధన విద్యకేంద్రంలో గురువారం రాబ్డోఫీస్ ప్లంబికలర్ అనే అరుదైన విషపు రహిత సర్పం పురుడు పోసుకున్నట్లు బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. ఏప్రిల్ 30న మహబూబ్నగర్ వీరన్నపేటలోని ఒక ఇంట్లో పాము రాగా స్థానికుడు లోకేష్ చంపకుండా పట్టుకొని తమకు అప్పగించారని.. అదేరోజు రాత్రి 9 గుడ్లు పెట్టిందని వివరించారు.
ఆ గుడ్లను బయో డైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో పొదగగా 6 పిల్లలు బయటకు వచ్చాయని.. సాధారణంగా ఈ పాములు ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే గుడ్లను పొదుగుతాయని, వాతావరణ మార్పులతో జూన్లోనే పొదిగిందన్నారు. పాము పిల్లల మెడలపై బాణం ఆకారంలో పసుపురంగు గుర్తులు.. కంటి నుంచి నోటి వరకు నలుపు రంగు చారలు ఉన్నాయని వివరించారు. రీసెర్చ్ సెంటర్లో ఉన్న అరకొర వసతుల నడుమ ఇప్పటికే పలుమార్లు పాములు పిల్లల్ని పొదగడం అనేక పరిశోధన కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పాము పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు చెప్పారు.