మహబూబ్ నగర్: ఒకనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్కే ఈరోజు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచందన్నారు సీఎం రేవంత్రెడ్డి. మిడ్జిల్ “కృతజ్ఞత సభ”లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు.
‘జూలై 2, 2006 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. 20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వం బాధ్యత నిర్వహించిన అనుభవం ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ జిల్లా బిడ్డనే.
ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డిది ఈ గడ్డనే. జైపాల్ రెడ్డి రాజకీయ ఎదగడానికి తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి ఈ మిడ్జిల్ బిడ్డ. అందుకే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం.
జూలై 4,2006 నా గెలిచిన గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్ప నిర్ణయం. నా వల్ల ఎవరికీ కష్టం నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జర్పీటీసీ అభ్యర్థిగా నాపై ఓడిన రబ్బానీకి ఈనాడు ఒక మంచి పదవి ఇవ్వాలని ఉపముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా’ అని పేర్కొన్నారు.


