వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు

Ramagundam CP Press Not On Vaman Rao Murder Case - Sakshi

వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి

పత్రికా ప్రకటన విడుదల చేసిన రామగుండం సీపీ

సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలిపెట్టేదిలేదని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్ చేశామన్నారు. వామన్‌రావును హత్య చేయాలని పది నెలల క్రితమే ప్లాన్‌ చేశారని, చాలా సార్లు స్కెచ్‌ విఫలమైందని తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా పలు విషయాలు తెలిసినవని చెప్పారు.

 పోలీసులు తెలిపిన వివరాలు (బిట్టు వాంగ్మూలం)

  • బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు.
  • మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్టుపై మృతుడు గట్టు వామన్ రావు ట్రస్ట్‌పై పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించేవాడు.
  • బిట్టు శ్రీనుపై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు మరియు ట్రస్ట్ యొక్క ఆదాయాల పై హైదరాబాద్‌, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేపించేవాడు.
  • 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీనుకు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చి లో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను యొక్క ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలి అని పంచాయతీ అధికారిపై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానితో ఆ అధికారి ట్రాక్టర్ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. దానిపై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని గట్టు వామనరావు బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

    బిట్టు శ్రీను- కుంట శ్రీను కి గల సంబంధం

  • మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్‌గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవి కూడా కలిసేవాడు. 
  • ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు హైకోర్టు న్యాయవాదులుగా చలామణి అవుతూ కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో కుంట శ్రీనివాస్  పై కేసు పెట్టించారు .
  • కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు కుంట శ్రీనును చైర్మన్‌గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని అక్రమ నిర్మాణం అని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించి వామన్ రావు దంపతులు గుడి నిర్మాణం ఆపించడం  జరిగింది.
  • కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని నిర్మాణం ఆపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం జరిగింది.
  • గుంజపడుగు లో రామ స్వామి గోపాల స్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చైర్మెన్ గా చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దుపరచి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావు నీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిందని ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని దానికి బిట్టు శీను కూడా కుంట శ్రీను తో తనకి  కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడు వ్యక్తిగతంగా తీవ్ర నష్టం చేసాడని గట్టు వామన్ రావు ని చంపే విషయాలలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు.
  • అందాద నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా అని బిట్టు శ్రీనుకి చెప్పగా బిట్టు శ్రీను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చేపించి చిరంజీవి ఇంట్లో పెట్టారు.
  • బిట్టు శీను అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావుని చంపకపోతే మనకు భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుందని చాలా సందర్భాల్లో గత 10 నెలల నుండి కుంట శీను, బిట్టు శ్రీనుకు చెప్పడం జరిగింది.
  • అందదా నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శీనుకు చెప్పగా వెంటనే ఇట్టి విషయం కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తెలియజేశాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు.
  • అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాప్‌లో వెయిట్ చేశాడు. వామన్ రావు వాళ్ళ ఇంటికి వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తికి సన్మానం చేస్తుండగా కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్నా పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూసి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావుని  హత్యా ప్లాన్  విరమించుకున్నారు.
  • వామన్ రావు హత్య పథకంలో ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో తేదీ 17.2.2021 రోజు మధ్యాహ్నం సమయంలో మంథని కోర్టుకి గట్టు వామన్ రావు దంపతులు వచ్చారు అని తెలిసి కుంట శీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా అప్పుడు కోర్టు దగ్గర లో ఉన్న కుంట లచ్చయ్య కి ఫోన్ చేసి వామన్ రావు ఉన్నది నిజమని నిర్ధారణ చేసుకుని మరల చెప్పడం జరిగింది.
  • వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంట్‌గా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పినాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా కత్తులు కార్ లో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయాడు.
  • కల్వచర్ల సమీపంలో వామన్ రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపాము అని  కుంట శ్రీను బిట్టు శ్రీను కి ఫోన్లో తెలపగా బిట్టుశ్రీను మంచిది, మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు.

ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న  అవసరం ఉంది. ఇంకా కొంతమంది  సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా  సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ,హత్యకు సంబంధించిన వీడియో లు సమాచారం,ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరుగుతుంది అంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top