
చెల్లించాల్సిన మొత్తం రూ.68,67,885
సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పదేపదే చెప్పే పోలీసులే.. ఆ నియమాలు తమకు పట్టవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు వాడే వాహనాలు సాధారణంగా తెలంగాణ డీజీపీ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. ఇలా డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 17,391 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఈ చలానాల కింద మొత్తం రూ.68,67,885 చెల్లించాల్సి ఉంది.
హైదరాబాద్ ట్రాఫిక్ మన్గా పేరుపొందిన లోకేంద్రసింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా, ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. ‘ఇది నిజంగా ప్రజలకు చెడ్డ ఉదాహరణ. నేను ట్రాఫిక్ పోలీసులను చాలా గౌరవిస్తాను. అలాగే చట్టాన్ని అమలు చేసే అధికారుల పారదర్శకత, జవాబుదారీతనం పట్ల నాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో పోలీసులు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అభ్యరి్థస్తారని నేను ఆశిస్తున్నాను’అని లోకేంద్రసింగ్ పేర్కొన్నారు.
పోలీసు వాహనాలపై పెద్ద ఎత్తున చలాన్లు పెండింగ్లో ఉండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘చలాన్ల చెల్లింపుపై ట్రాఫిక్ వాళ్లు పెట్టిన డిస్కౌంట్ ఆఫర్లు వీళ్లు మర్చిపోయినట్టు కనిపిస్తోంది’అని ఒకరు. ‘ఈ వాహనాలను కూడా ప్రయాణం మధ్యలో ఆపి, మిగతా వారందరికీ చేస్తున్నట్లుగా, డబ్బు చెల్లించిన తర్వాతే వాహనాలను ముందుకు అనుమతించాలి’అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఈ మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి చెల్లిస్తారు. కానీ, జరిమానాలను ఆ వాహనాలు నడిపిన డ్రైవర్ల నుంచి వసూలు చేయాలి’అని మరొకరు కామెంట్ పెట్టారు.