‘వన్ డే కొత్వాల్’ సాదిఖ్ ఇకలేడు
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయసులో హైదరాబాద్ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్గా పని చేసిన బాలుడు సాదిఖ్ బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్ బాషా తెలిపారు. సాదిఖ్కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ.
ఈ నేపథ్యంలోనే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్ 15న సాదిఖ్ను హైదరాబాద్ నగరానికి ఒక రోజు కమిషనర్గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్గా ఉన్న ఎం.మహేందర్రెడ్డి నుంచి సాదిఖ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సాదిఖ్ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్ బాషా అన్నారు.