సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించుకోండి
గోదావరి మేనేజ్మెంట్ రివర్ బోర్డు చైర్మన్ పి.దోర్జే గ్యాంబ
కన్నాయిగూడెం: దేవాదుల జె. చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఎలాంటి సమస్యలున్నా తక్షణమే పరిష్కరించుకుని పంపింగ్కు సిద్ధంగా ఉండాలని గోదావరి మేనేజ్మెంట్ రివర్ బోర్డు చైర్మన్ పి.దోర్జే గ్యాంబ అన్నారు. ‘దేవాదుల ఫేజ్–2లో మోటారులో సాంకేతిక సమస్యలు’శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఆదివారం బోర్జే గ్యాంబ.. అధికారులతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం పంచాయతీ పరిధి గుట్టలగంగారం వద్ద ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతలను సందర్శించారు. మోటార్ల పనితీరు, గోదావరి నీటిని పంపింగ్ చేస్తున్న పద్ధతి, గోదావరి నీరు కాల్వ ద్వారా పంపింగ్ వద్దకు చేరుతున్న విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫేజ్–2లో రిపేర్లో ఉన్న మోటారును పరిశీలించారు. వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం ఎత్తిపోతల ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ మాట్లాడుతూ దేవాదుల వద్ద పంపింగ్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిరంతరం పంపింగ్ చేయడానికి కావాల్సిన నీటిని బ్యారేజీ వద్ద సమకూర్చుకోవాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల లక్ష్యం చేరడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు.


