సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ముఠా...నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుంది. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో 12 నేరాలు చేసింది. ఎలాంటి ఆధారం లేకుండా ‘పని’ ముగించింది. వీరి కోసం రంగంలోకి దిగిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ చోరుడు ధరించిన పసు పు రంగు చెప్పులే కీలక ఆధారంగా అధికారులు ముందుకు వెళ్లారు. ఈ గ్యాంగ్పై గతంలోనూ అనేక కేసులు ఉన్నట్లు డీసీపీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, కె.శ్రీకాంత్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
మేలో అరెస్టు... అక్టోబర్లో బెయిల్...
భీమవరానికి చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు ఈ గ్యాంగ్కు లీడర్గా ఉన్నాడు. కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్న ఇతడిపై ఏపీలోని వివిధ ఠాణాల్లో 41 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మేలో పి.గన్నవరం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి అక్టోబర్లో బెయిల్పై బయటకు వచ్చాడు. ఆపై తమ ప్రాంతానికే చెందిన పాత నేరగాళ్లు దాగారపు ఎల్యజూర్ (గతంలో 30 కేసులు), మారుబోయిన మావుళ్లు (గతంలో 6 కేసులు), గండ్రెడ్డి లోకే‹Ùలతో (గతంలో 16 కేసులు) కలిసి ముఠా కట్టాడు. హైదరాబాద్ను టార్గెట్గా చేసుకుని వచ్చిన వీళ్లు నాదర్గుల్ సమీపంలోని కమ్మగూడలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 5న నందిగామ వెళ్లిన వీళ్లు అక్కడ బైక్ చోరీ చేశారు. దానిపై ఇద్దరు, బస్సులో ఇద్దరు చొప్పున నగరానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి వరుస పెట్టి చోరీలు చేయడానికి నిర్ణయించుకున్నారు.
నాలుగున్నర గంటల్లో పది చోట్ల...
ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు కమ్మగూడ నుంచి ఒకే బైక్పై బయలుదేరిన ఈ నలుగురూ హయత్నగర్ వెళ్లారు. అక్కడ మరో బైక్ తస్కరించి ఒక్కో దానిపై ఇద్దరు చొప్పున మొదలయ్యారు. తెల్లవారుజామున 1.20–1.40 గంటల మధ్యలో సరూర్నగర్లోని మూడు దుకాణాల్లో, అట్నుంచి సైదాబాద్ వెళ్లి 1.50–2.15 గంటల మధ్య రెండు దుకాణాల్లో, ఆపై బేగంబజార్ చేరుకుని 3.01–3.15 గంటల మధ్య ఓ దేవాలయంలో, అక్కడ నుంచి సుల్తాన్బజార్ వెళ్లి 3.45–4 గంటల మధ్య మరో దేవాలయంలో, చివరకు ఐఎస్ సదన్ వచ్చి 4.15–4.30 గంటల మధ్య దేవాలయం, దుకాణంలో చోరీలు చేశారు. ఆపై తమ షెల్టర్కు వెళ్లి మిన్నకుండిపోయారు. వీరికి ప్రతి చోరీలో చిల్లర నాణాలు, కొద్దిపాటి కరెన్సీ నోట్లు మాత్రమే దక్కాయి. ఐఎస్ సదన్లోని దేవాలయంలో జరిగిన చోరీని సీరియస్గా తీసుకున్న సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది.
లైట్ల వెలుగులో విభిన్నంగా కనిపించి...
ఈ గ్యాంగ్ను పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు నేతృత్వంలో ఎస్సైలు కె.రామారావు, ఎం.మధు తమ బృందాలతో రంగంలోకి దిగారు. ఘటనాస్థలాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను సేకరించి అధ్యయనం చేశారు. అయితే ఎక్కడా నేరగాళ్లు ముఖాలు, వాహనాల నెంబర్లు స్పష్టంగా నమోదు కాలేదు. ఓ నేరగాడు ధరించిన పసుపు రంగు చెప్పులు మాత్రం రాత్రి వేళ లైటింగ్కు విభిన్నంగా కనిపించాయి. దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ వీరి వాహనం వెనుక మరో వాహనం నడిచింది. ఈ ఆ«ధారంగా ముందుకు వెళ్లిన టాస్్కఫోర్స్ బృందం సోమవారం నాదర్గుల్ వరకు వెళ్లి కాపుకాసింది.
అక్కడ ఓ మద్యం దుకాణం వద్దకు పసుపు చెప్పులు వేసుకున్న నేరగాడే రావడంతో గుర్తించి పట్టుకుంది. ఇతడిచి్చన సమాచారంతో అద్దె ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు నేరగాళ్లుతో పాటు వీరికి సహకరిస్తున్న మహిళ కె.రజ్జి, ఓ మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సొమ్ముతో పాటు వాహనాలు, స్రూ్కడ్రైవర్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు.


