సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వానికి తాడిపత్రిలో ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త.. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను టీడీపీకి ఓటు వేసి తప్పుచేశానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను వీడియో చేశారు. దీంతో, సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది.
తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడగూరుకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ.. నేను టీడీపీకి ఓటు వేసి తప్పు చేశాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 మాసాలైనా నా తల్లికి పెన్షన్ మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ కోసం ఎంతో పనిచేశాం. నా సొంత డబ్బులను సైతం ఖర్చు పెట్టాను. టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాం.
కానీ, ఇప్పుడు కార్యకర్తలనే పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు. తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు. మాకు అన్యాయం జరుగుతున్నా చూసిచూడని విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు సరిగా అందడం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


