సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి న్యాయం చేసేందే కేసీఆర్. సింగరేణి నల్ల బంగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అత్తగారి కొంగు బంగారంగా బావమరిదికి రాసిచ్చారు అంటూ ఆరోపణలు చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి?. జిల్లాలపై కమిటీ వేసిన రేవంత్ నిన్నటి సభలో భూపాలపల్లి జిల్లాను తీసేయం అని చెప్తున్నాడు.
అసలు జిల్లాలు ఇచ్చింది కేసీఆర్. అలాంటి జిల్లాలను తీసేయడానికి నువ్వెవరు రేవంత్?. సింగరేణికి న్యాయం చేసింది కేసీఆర్. కానీ, సింగరేణి నల్ల బంగారాన్ని రేవంత్ తన బావ మరిదికి రాసిచ్చారు. నల్ల బంగారం కుంభకోణాన్ని బయటపెట్టగానే ఫోన్ ట్యాపింగ్ అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన ఆధారాలు అన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు అగ్గి పెట్టి సాక్షా లు లేకుండా తగలపెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


