
కూతురుకు తాగించి, తాను తాగిన మహిళ
చిన్నారి మృతి.. చికిత్స పొందుతున్న తల్లి
నిజాంపేట్(మేడ్చల్ జిల్లా): కుటుంబ కలహాలా! లేక అనారోగ్యమో తెలియదుకాని.. ఆ ఇల్లాలు తనువు చాలించాలనుకుంది. తనతో పాటు తన నాలుగేళ్ల కూతురును సైతం తీసుకెళ్లాలని.. కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి తాను తాగి, కూతురుకు కూడా తాగించింది. దీంతో కూతురు మృతి చెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, హరితా ఆర్కేడ్ అపార్ట్మెంట్లో నంబూరి సాంబశివరావు, కృష్ణా పావని దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి నాలుగేళ్ల కూతురు జెశి్వక ఉంది. సాంబశివరావు ఐటీ ఉద్యోగికాగా, పావని గృహిణి. ఈ నెల 18న శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పావని కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగింది. కూతురు జెశి్వకకు కూడా తాగించింది. దీంతో ఆరోజు రాత్రి ఇద్దరూ పలు మార్లు వాంతులు చేసుకున్నారు. రాత్రి ఇంటికి వచి్చన భర్తకు పావని ఈ విషయం చెప్పలేదు. శనివారం ఉదయం కూడా వాంతులు అవుతుండటంతో పావని భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో సాంబశివరావు వెంటనే వారిని కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. జెశి్వక పరిస్థితి విషమించడంతో రెయిన్బో ఆస్పత్రికి తరలించారు.
అయితే పరిస్థితి మరింత విషమించడంతో సాయంత్రం జెశ్విక మృతి చెందింది. పావని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పావని తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం పావని గత కొద్ది సంవత్సరాలుగా మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.