సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు అరెస్ట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా? అని సంచలన ఆరోపణలు చేశారు.
రామచందర్రావు అరెస్ట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా స్పందిస్తూ..‘బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలేవి?. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను రిమాండ్ ఎందుకు చేయలేదు?. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే ఇళ్లపై దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నారా?. ఫ్రెండ్లీ పోలీస్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించినట్టు ఉంది అని విమర్శలు కురిపించారు.
ఇదే సమయంలో పోలీసులను అడ్డుపెట్టకుని కాంగ్రెస్ పాలకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేయిస్తున్నారు. తక్షణమే రామచందర్రావును బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయి. కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: హైటెన్షన్.. రామచందర్రావు అరెస్ట్


