Jubilee Hills By Election: బరిపై మజ్లిస్‌ గురి! | MIM Party Fouce On Jubilee Hills By Election | Sakshi
Sakshi News home page

Jubilee Hills By Election: బరిపై మజ్లిస్‌ గురి!

Jun 23 2025 7:34 AM | Updated on Jun 23 2025 7:34 AM

MIM Party Fouce On Jubilee Hills By Election

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో నిలిచేందుకు పతంగి పథకం

ఇప్పటికే కొన్ని డివిజన్లలో ఆ పార్టీ ప్రాతినిధ్యం 

పాగా వేసేందుకు మూడు పర్యాయాలుగా యత్నం

ఈసారి పకడ్బందీ వ్యూహంతో అడుగులు

సాక్షి, హైదరాబాద్: మజ్లిస్‌ పార్టీ ‘జూబ్లీహిల్స్‌’ అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెగ్మెంట్లలోని డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్ధానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీపడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో నిలిచింది. 

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్‌ దోస్తీ కోసం బరిలో దిగలేదు.  ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నా.. సిట్టింగ్‌ సీటు బీఆర్‌ఎస్‌ది కావడంతో పోటీలో ఉండాలని  భావిస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. స్నేహపూర్వకంగానే పోటీ ఇచ్చి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిస్తోంది. 

ఇదీ పరిస్థితి.. 
2014లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్‌ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో ఆ పార్టీ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్‌ యాదవ్‌ తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి  మిత్రపక్షమైన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. నవీన్‌ యాదవ్‌ మజ్లిస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి సుమారు 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన మజ్లిస్‌..

 జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్‌.. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి షేక్‌పేట కార్పొరేటర్‌ మహ్మద్‌ రషీద్‌ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్‌ఎస్‌కు సహకరించేందుకు మజ్లిస్‌ పార్టీ  బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అందరూ ఊహించినట్లే బీఆర్‌ఎస్‌కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం చేజారగా.. కాంగ్రెస్‌ గద్దెనెక్కింది. ఆ తర్వాత  కాంగ్రెస్‌తో మజ్లిస్‌ స్నేహం కుదరింది. తాజాగా సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక  అనివార్యమైంది.

ముస్లిం ఓటర్లు మూడో వంతు
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లలో  మజ్లిస్‌ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రతినిత్యం స్థానిక సమస్యలపై  పైదల్‌ దౌరా (పాదయాత్ర)  నిర్వహిస్తుండటంతో ప్రజల్లో కూడా గట్టి పట్టు ఉంది. దీంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మజ్లిస్‌ వైపు  మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఉప ఎన్నికల బరిలో గెలుపు గుర్రాన్ని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.

ఇటీవల పోటీ చేసిన షేక్‌పేట కార్పొరేటర్‌ మహ్మద్‌ రషీద్‌ పెద్దగా ఓట్లు రాబట్టుకోక పోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తోంది. మజ్లిస్‌ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్‌ సయ్యదా ఫలక్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో పాటు దేవబంద్, ఢిల్లీ, షాహీన్‌బాగ్‌లలో జరిగిన  నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement