తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు కే. వెంకట్ రామ్రెడ్డి (KVR) అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి సమయంలో ఆయన నివాసానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవీఆర్ను అదుపులోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయనను ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? ఏ పోలీస్ స్టేషన్కు తరలించారు? అనే విషయాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసుల బృందం మఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తెలంగాణలోని కేవీఆర్ నివాసానికి వెళ్లింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేవీఆర్ భార్య పోలీసులను వేడుకున్నా.. చిన్నారుల ముందే ఆయనను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
సమాచారం ప్రకారం.. ఏపీ మంత్రి నారా లోకేష్పై కేవీఆర్ చేసిన రాజకీయ విశ్లేషణకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 152, 196, 353 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే కేసులో ఈ ఏడాది మార్చి 11న కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి కేవీఆర్ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదని తెలుస్తోంది.
తాజాగా మరోసారి ప్రత్యేక బృందం తెలంగాణకు చేరుకుని కేవీఆర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలుత మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పీఎస్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారన్నుదానిపై స్పష్టత లేదు. దీంతో ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు, సహచర జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక జర్నలిస్టును అర్థరాత్రి సమయంలో మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకెళ్లడం, కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా తరలించడం పట్ల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేవీఆర్ను ఎక్కడ ఉంచారు? ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? అనే వివరాలను వెంటనే వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అరెస్టుకు గల పూర్తి కారణాలు, కేసు వివరాలు, కేవీఆర్ను ఏ పోలీస్ స్టేషన్కు తరలించారన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అంతవరకు ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


