Marredpally Si Vinay Kumar: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు

Marredpally Si Vinay Kumar Attacked by Unknown Persons - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారేడుపల్లి ఎస్సై వినయ్‌ కుమార్‌పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.  ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్‌, మరో పోలీస్‌ అధికారి సత్యనారాయణతో కలిసి తనిఖీలు నిర్వహిన్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపారు. ఇద్దరిని విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపు, వెన్ను భాగంలో  పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్‌ నగర్‌లో నివాసముండే పవన్‌, సంజయ్‌గా గుర్తించారు. నిందితులు పీడీయాక్ట్‌ కింద జైటుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులుగా గుర్తించారు. 
చదవండి: చిన్నపాటి వివాదం యువజంట బలవన్మరణం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top