తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ వివాహితను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దండేపల్లి మండలం నిల్కి వెంకటాపూర్లో సింగతి లక్ష్మి (37) అనే వివాహిత నివాసం ఉంటుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆమె బంధువు సింగతి రవి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో విచక్షణ రహితంగా నరికి చంపాడు. దీంతో సింగతి లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే నిందితుడు హత్యచేసిన వెంటనే ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలోని స్థానికులలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. అయితే, హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని పట్టుకున్నాకే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.


