
ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరింపులు
భూ వివాదంలో ఘర్షణ వీడియో వైరల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూవివాదం కాస్త ముదిరి ‘హత్య చేస్తా’.. అని బెదింరింపులకు దిగే వరకు వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నెలకొంది. కాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడికి దిగారు.
అతడిపై పిడి గుద్దులు గుద్దుతూ దాడిచేయగా ఇద్దరు మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆగకుండా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ‘ఐదు ఎకరాలు అమ్మి అయినా సరే నిన్ను చంపేస్తా’ అంటూ ఒక వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఇదంతా ఫోన్లో మరొకరు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ను వివరణ కోరగా, దాడికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, భూ సంబంధిత అంశం కావడంతో ఇరువురిని పోలీస్స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు.