సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్ను పట్టించుకోవడం లేదన్నారు.
ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు.
కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.
అంతకు ముందు మెట్రో ఫేజ్-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు.


