సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయించబోతోంది.
సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు.
అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్లో అన్నీ తప్పులే!


