ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు

KTR Launches Telanganas 2nd ICT Policy 2021 - Sakshi

సాధికారతే లక్ష్యంగా రెండో ఐటీ పాలసీ 

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లతో 50 వేల ఉద్యోగాలు 

మారుమూల ప్రాంతాల్లో 12 వేల ‘డిజిటల్‌ తెలంగాణ సెంటర్లు’ 

8వేల స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రూ.13వేల కోట్లతో స్టా్టర్టప్‌ ఫండ్‌ 

ఆధునిక ఐటీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు ‘ఎమర్జింగ్‌ టెక్నాలజీ కారిడార్‌’ 

రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

సాధారణ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ల వినియోగం మొదలుకుని, అత్యాధునిక సాంకేతికత దాకా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ డిజిటల్‌ జీవితాన్ని అందిస్తాం. ప్రజల రోజువారీ జీవితానికి తోడ్పడేలా మెరుగైన పౌర సేవలను కాగిత రహిత విధానంలో అందిస్తాం. ప్రతి ఇంట్లో ఒకరిని, స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి డిజిటల్‌ సేవలు అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ‘డిజిటల్‌ తెలంగాణ సెంటర్లు’ఏర్పాటు చేస్తాం.     – మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పి ంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ప్రకటించారు. డిజి టల్‌ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని గురువారం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఉత్పాదకత, ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. స్టార్టప్‌లు, పెట్టుబడిదారులకు తెలంగాణను మొదటి గమ్యస్థానంగా మార్చుతామని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లను స్థాపించడం ద్వారా ఐటీ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. చదవండి: గృహ రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ బొనాంజా

కొత్త ఐటీ పాలసీ లక్ష్యాలెన్నో.. 
డ్రైవింగ్‌ టెస్ట్‌ వంటి సేవలు మినహా దాదాపు ప్రభుత్వ సేవలన్నింటినీ.. వెబ్, మొబైల్‌ యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తామని, కాగితరహిత పాలన అందిస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘‘కొత్త టెక్నాలజీల యుగంలో ఐటీ పట్టభద్రులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా కృత్రిమ మేథస్సు (ఏఐ) సాంకేతికతపై ప్రాథమిక శిక్షణ ఇస్తాం. రూ.13 వందల కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌తోపాటు ప్రభుత్వ పెట్టుబడుల కమిటీ ఏర్పాటు చేసి 8వేల స్టార్టప్‌లకు చేయూతనిస్తాం. దేశంలోనే తెలంగాణను స్టార్టప్‌లకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్‌ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, ఆటోమొబైల్‌ రం గాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం. ఎలక్టానిక్స్‌ రంగం ద్వారా రూ.75వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కారిడార్‌’ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. డేటా స్టాక్, డేటా ఎనాలసిస్‌ వింగ్‌ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి ష్కారాల ద్వారా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) అం డగా నిలుస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో ‘స్మార్ట్‌ సిటీస్‌ వింగ్‌’ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 40 ‘స్మార్ట్‌ రీజియన్లు’సృష్టిస్తాం..’’అని ప్రకటించారు. చదవండి: ఏకతాటిపైకి టెల్కోలు

ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి 
కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్వితీయంగా పురోగమించిందని నాస్కామ్‌ చైర్‌పర్సన్‌ రేఖా మీనన్‌ అభినందించారు. రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీనన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పాలసీలతో పురో గామి విధానాలు అవలంభిస్తోందని ప్రశంసిం చారు. ఇక తెలంగాణ ఐటీ రంగంతో అమెరికాకు గాఢమైన బంధముందని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రైఫ్‌మన్‌ అన్నారు. హైదరాబాద్‌లో 48 అమెరికా ఐటీ సం స్థల కార్యకలాపాల ద్వారా 1.10 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సైయంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, రాజన్న(టీసీఎస్‌), ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవి లంక, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌లు పాల్గొన్నారు.  

దేశంలోనే వేగంగా పురోగమిస్తున్నాం 
కోవిడ్‌తో జాతీయ వృద్ధిరేటు 1.26 శాతానికి పడిపోయినా.. రాష్ట్రం 2020–21లో రూ.9.78 లక్షల జీఎస్‌డీపీ, 8%వృద్ధిరేటు సాధించిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేటీఆర్‌ అన్నారు. రూ.1.45 లక్షల కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించామని, 2016 నాటి తొలి ఐసీటీ పాలసీ లక్ష్యాలను అం దుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షించామని, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించామని తెలిపారు. ఇం దులో కేవలం ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతోపాటు దేశంలోని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 7% వాటా సాధించామన్నారు. టీహబ్, వీహబ్, టీఎస్‌ఐసీ, రీచ్, టాస్క్, టీవర్క్స్‌ వంటివాటితో ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించామని, 15 వందలకుపైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్ల మేర నిధులు అందా యని తెలిపారు. టాస్క్‌ద్వారా 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, ఆన్‌లైన్‌లో 500 రకాల ప్రభుత్వ సేవలు, టీ యాప్‌ ఫోలియో ద్వారా 250 ప్రభు త్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓపెన్‌డేటా, బ్లాక్‌ చెయిన్, డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ అడాప్షన్‌ వంటి పాలసీలు, 3వేలకు పైగా పబ్లిక్‌ వైఫై పాయింట్లు, ఐదు లక్షల మందికి డిజిటల్‌ అక్షరాస్యత వంటి లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top