
రూ.421.66 కోట్లతో రైల్వే స్టేషన్ పునరభివృద్ధి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి
ఫసాడ్ లైటింగ్ వ్యవస్థకు ప్రారంభోత్సవం
కాచిగూడ: ఫసాడ్ లైటింగ్ వ్యవస్థ ద్వారా కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన కాచిగూడ రైల్వే స్టేషన్లో రూ.2.33 కోట్ల వ్యయంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను కిషన్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలంలో 1916లో ‘గోతిక్ శైలి’లో కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు. ఈ స్టేషన్ అద్భుత నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారతీయ రైల్వేలో తొలి డిజిటల్ పేమెంట్ సేవలు కాచిగూడలోనే ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నో రకాల ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వే స్టేషన్ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద పునరభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.
వచ్చే 30 సంవత్సరాల అవసరాలను తీర్చేలా రూ.2,750 కోట్లతో రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కొర్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, బీజేపీ నేతలు డాక్టర్ ఎన్.గౌతంరావు, కృష్ణ యాదవ్, వై.అమృత, సి.నందకిషోర్ యాదవ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.