
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే, వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇక, ఎస్ఐ రాణా ప్రతాప్, రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, మొదటి నుంచి రాణా ప్రతాప్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి అని.. వివాదాల్లో ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలో సర్వీస్ రివాల్వర్ చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. సస్పెండ్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు.. రాణా ప్రతాప్ సోదరుడు మహేష్ కూడా ఎస్ఐగానే విధులు నిర్వహిస్తునన్నారు.