కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో..! | KCR Conveys Wishes To People On Occasion Of Telangana Formation Day | Sakshi
Sakshi News home page

ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

Jun 2 2022 3:09 AM | Updated on Jun 2 2022 3:09 AM

KCR Conveys Wishes To People On Occasion Of Telangana Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా అన్నివిధాలా ఆటంకం కలిగిస్తోందని.. అయినా మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధనదిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో పునర్నిర్మించుకుంటున్నామని.. నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాల్సిన సందర్భమని ప్రకటించారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజురోజుకూ గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటోందన్నారు. కేంద్రం సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలే దీనికి సాక్ష్యమని తెలిపారు. పలు విధాలుగా పథకాలను అమలుచేస్తూ ఎనిమిదేళ్లలోనే ఊహించనంత సంక్షేమం, అభివృద్ధిని సాధించామన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యం సహా అన్నిరంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతోందని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రజాసంక్షేమ పాలనను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement