
ప్రియుడితోనే ఉంటానని చెప్పిన భార్య
అవమానభారంతో వ్యవసాయ బావిలో దూకి భర్త ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో విషాదం
బోయినపల్లి (కరీంనగర్): భార్య వివాహేతర సంబంధంతో అవమానంగా భావించిన ఓ భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగింది. తడగొండకు చెందిన హరీశ్ (36)కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహం జరిగింది.
వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. హరీశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. కాగా అతడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయంలో ఫోన్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ నెల 8న హరీశ్ దుబాయి నుంచి తడగొండకు వచ్చాడు.
ఈ క్రమంలో కావేరి ‘నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా’అని భర్తతో తేల్చిచెప్పింది.దీంతో మనస్తాపం చెందిన హరీశ్ మంగళవారం ఉదయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఓ వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆదేశాలతో బావిలోని నీటిని మోటార్లతో తోడేయగా, హరీశ్ మృతదేహం లభ్యమైంది. హరీశ్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కావేరి, రక్షణ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.