2,13,020 IT Employees Fired Worldwide in 2023 - Sakshi
Sakshi News home page

మళ్లీ లేఆఫ్స్‌డౌన్‌ ట్రెండ్‌లో ఐటీ.. టెకీల తొలగింపులో బెంగళూరు టాప్‌ 

Jul 20 2023 4:12 AM | Updated on Jul 20 2023 1:56 PM

IT sector in down trend - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: లేఆఫ్స్‌ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణపెంపుతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు.

ఆరునెలల్లోనే 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన 2023లో (జనవరి నుంచి జూన్‌) ప్రపంచవ్యాప్తంగా 2,13,020 మంది ఉద్యో గులకు ఉద్వాసన  పలికినట్టు లేఆఫ్స్‌. ఎఫ్‌వైఐ వెబ్‌సైట్‌ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా, ఈ ఆరునెలల్లో ఉద్యోగుల లేఆఫ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్‌ ఉన్నాయి.

 భారత్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య  6,530. ఈ ఏడాదితో  పోల్చి చూసినప్పుడు  తొలి ఆరునెలల్లో  టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్‌ విజృంభించిన 2020లోనూ భారత్‌లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్‌లకు ఫండింగ్‌ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. 


బెంగళూరు టాప్‌ 
టెకీల తొలగింపులో భారత్‌లో బెంగళూరు మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్‌ హబ్‌గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో లేఆఫ్‌లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్,ఎఫ్‌వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. 
 

ఇప్పుడు స్టార్టప్‌లదీ వ్యథే...
గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్‌ స్టార్టప్‌లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌  సెగ తాకినట్టు ఐఎన్‌సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్‌టెక్‌ స్టార్టప్‌లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని, 59 స్టార్టప్‌లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు. 
ఆ ఏడాది చివరి దాకా తప్పదు 


ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్‌ డౌన్‌ట్రెండ్‌లోనే ఉందని చెప్పాలి. టెకీల లేఆఫ్‌ చేసే పరిస్థితులు ఈ ఏడాది చివరిదాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్‌ ఎకానమీ ఎఫెక్ట్‌ కారణంగా ఆర్థికరంగ పరిస్థితి బాగా లేకపోవడంతో అమెరికా తో సహా ఇతరదేశాలు ప్రభావితమవుతున్నాయి. ఐటీ ఎనబుల్డ్‌ సర్వీసెస్‌పై ఈ ప్రభా వం ఎక్కువగా ఉండగా, భారత్‌లోనే కొంత ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. పాత టెక్నాలజీపై పనిచేస్తూ, పనితీరు బాగాలేని వారికి ఉద్వాసన పలికేందుకు దీనిని కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం స్టార్టప్‌లపై తీవ్రంగా పడింది.  

   – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌ గ్రూప్‌ చైర్మన్, ఎడ్‌టెక్‌ కంపెనీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement