ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు | Irregularities in IT payments of Tollywood celebrities | Sakshi
Sakshi News home page

ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు

Jan 24 2025 4:29 AM | Updated on Jan 24 2025 10:54 AM

Irregularities in IT payments of Tollywood celebrities

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల సోదాల్లో గుర్తింపు! 

మూడురోజుల పాటు  8 చోట్ల అధికారుల తనిఖీలు 

డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఆడిట్‌ రిపోర్టులు స్వాదీనం 

సుకుమార్, దిల్‌రాజు,నవీన్‌ ఎర్నేని, నెక్కంటి శ్రీధర్‌ తదితరుల ఇళ్లపై దాడులు  

సోదాల సమయంలో దిల్‌రాజు తల్లికి అస్వస్థత 

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. 

భారీ బడ్జెట్‌ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్‌్కలు, ఆడిట్‌ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్‌మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం.  

భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. 
ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్‌ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్‌ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్‌ సినిమాలకు ఫైనాన్స్‌ చేసే సత్య రంగయ్య, అభిషేక్‌ అగర్వాల్‌ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్‌ సుకుమార్‌ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 

గురువారం సైతం సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్‌ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు  సాగుతుండగానే దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement