పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ | Inflammatory Syndrome In Children | Sakshi
Sakshi News home page

పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌

Oct 10 2020 7:50 AM | Updated on Oct 10 2020 7:50 AM

Inflammatory Syndrome In Children - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అదృష్టవశాత్తు పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నా కొద్దిమందిలో మాత్రం కోలుకున్న తర్వాత ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరు పెద్దల్లో మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమే టరీ సిండ్రోమ్‌ వల్ల అవయవాల పనితీరు దెబ్బతింటోంది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితి త్తులు, గుండె తదితర ముఖ్యమైన భాగాల న్నింటిపైనా ఇది ప్రభావం చూపుతోంది. రక్తంలో క్లాట్లు (గడ్డలు) ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పుడు కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్న పిల్లలపైనా మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ దాడి చేస్తోందని పిల్లల వైద్య నిపుణులు గుర్తించారు. కోలు కున్న 3 వారాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోం దని అంటున్నారు. కవాసాకి అనే వ్యాధి కూడా పిల్లల్లో కనిపిస్తోందంటున్నారు. సిండ్రోమ్, కవాసాకి లక్షణాలు దగ్గరగా ఉంటాయి. అయి తే సిండ్రోమ్‌లో అన్ని అవయవాలపైనా వైరస్‌ తీవ్రత ప్రభావం చూపుతుంది. కవాసాకిలో మాత్రం గుండెపైనే ప్రభావం చూపుతుంది. 

గాంధీ, నీలోఫర్‌ ఆస్పత్రుల్లో 42 మందికి
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో పదేళ్ల లోపు పిల్లలు 4.18 శాతం మంది ఉండగా, 11 నుంచి 20 ఏళ్లలోపు వారు 8.95 శాతం మంది ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో 42 మంది మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో గాంధీ ఆస్పత్రిలో 38, నీలోఫర్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. వారిలో నలుగురు చనిపోయారని వైద్యులు చెప్పారు. మిగిలిన పిల్లలకు వైద్యం చేస్తున్నారు. సిండ్రోమ్, కవాసాకిలతో పెద్దగా ప్రమాదం లేకున్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చాలావరకు యాస్పిరిన్, స్టెరాయిడ్స్‌తో ఇది తగ్గిపో తుందని రెండ్రోజుల కిందట లాన్సెట్‌ అనే ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ స్పష్టం చేసింది. 

పిల్లల్లో సిండ్రోమ్‌ లక్షణాలు
జ్వరం
వాంతులు
డయేరియా
కడుపులో నొప్పి
శరీరంపై దద్దుర్లు
కళ్లు ఎర్రగా మారిపోవడం
పెదాలు, నాలుక మరింత ఎర్రగా మారడం లేదా వాపు
నీరసంగా ఉండటం
పాదాలు, చేతులు ఎర్రగా మారడం లేదా వాపు
కొందరిలో ఛాతీ నొప్పి, తీవ్ర నిస్సత్తువ
శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
తీవ్రత పెరిగితే పెదాలు, 
ముఖం నీలం రంగులోకి మారడం, తీవ్రమైన కడుపునొప్పి

లక్షణాలను గుర్తించాలి
కరోనా తగ్గాక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సిండ్రోమ్‌ వల్ల పిల్లలకు పెద్దగా ప్రమాదం లేకపోయినా లక్షణా లుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నీలోఫర్‌లో ఇటువంటి కేసులకు మేము వైద్యం చేశాం. వారిలో కొందరిని గాంధీ ఆస్పత్రికి కూడా రిఫర్‌ చేశాం. 
– డాక్టర్‌ నరహరి, అసోసియేట్‌ ప్రొఫెసర్, నీలోఫర్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement