ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయండి | Implement one police policy | Sakshi
Sakshi News home page

ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయండి

Oct 25 2024 4:43 AM | Updated on Oct 25 2024 4:43 AM

Implement one police policy

రోడ్డెక్కిన బెటాలియన్‌ పోలీసుల భార్యలు.. సిరిసిల్లలో చంటి పిల్లలతో ధర్నా

సిరిసిల్లక్రైం: రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానం అమలు చేయాలని కోరుతూ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే పోలీసుల భార్యలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే విధానంలో పరీక్ష పెట్టి పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపిక చేసి, విధుల్లో ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. 

బెటాలియన్‌ విధుల్లోకి వెళ్లిన తమవారు ఇంటికి రావడానికి నెలల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్న ఎక్కడ.. అమ్మా’అని పిల్లలు అడుగుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. ధర్నా విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని సూచించగా, వారు వినకపోగా నినాదాలు చేస్తూ నిరసనను తీవ్రతరం చేశారు. 

ఈ క్రమంలోనే వారిని వ్యాన్‌లో సర్దాపూర్‌ బెటాలియన్‌కు తరలించారు. 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా ఏదైనా సమస్య ఉంటే వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారులకు చెబుతామని, కానీ ఎవరూ వినతిపత్రం ఇవ్వలేదన్నారు.  

పదో బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబసభ్యులు కూడా.. 
ఎర్రవల్లి: బీచుపల్లి పదో బెటాలియన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారి–44 కూడలిలో గురువారం బైఠాయించారు. ఏక్‌ స్టేట్‌– ఏక్‌ పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. 

సమాచారం అందుకున్న అలంపూర్‌ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో ఇటిక్యాల, కోదండాపురం ఎస్‌ఐలు వెంకటే‹Ù, స్వాతి సిబ్బందితో అక్కడికి చేరుకొని పోలీస్‌ కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు టీజీఎస్పీ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బెటాలియన్‌ పోలీసులకు ఐదేళ్లు ఒకే దగ్గర పోస్టింగ్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement