రోడ్డుపై పారుతున్న నీరు, జరిమానా వసూలు చేస్తున్న అధికారులు
తాగే నీటిని దుర్వినియోగం చేయొద్దని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొంత మంది మారడం లేదు. ఒకపక్క జనం తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే, మరోపక్క కొంతమంది బాధ్యతారహితంగా మంచినీటిని వేస్ట్ చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం వినియోగించాల్సిన స్వచ్ఛమైన నీరుని దుర్వినియోగం చేస్తున్నారు. ఇళ్లు, వాహనాలు, బట్టలు శుభ్రం చేయడానికి మంచినీటిని వాడుతున్నారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా తాగునీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడం లేదు.
తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జలమండలి అధికారులు కొరడా ఝళిపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లో తాగునీటి దుర్వినియోగానికి పాల్పడుతున్న ఓ మహిళకు రూ.20 వేల జరిమానా విధించారు. తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్కు వినియోగిస్తూ దుర్వినియోగం చేసినట్లు గుర్తించడంతో ఈ మేరకు చర్య తీసుకున్నారు. శనివారం ఇంటి యజమాని నుంచి జలమండలి అధికారులు జరిమానా వసూలు చేశారు.
తాగునీరు అత్యంత విలువైన వనరని, ప్రజలు దానిని బాధ్యతాయుతంగా వినియోగించాలని నగర ప్రజలకు జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. తాగునీటిని ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్టు గుర్తిస్తే, సంబంధిత వివరాలను వాట్సాప్ నంబర్: +91 99499 30003కు పంపించాలని ప్రజలకు సూచించింది.
ఇదీ చదవండి: వినాయక భక్తులకు ఫ్రీ పార్కింగ్


