ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు గురైన దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు దానం. ఎల్లుండి దానం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తాను కోర్టుకు వెళ్లబోనని దానం నాగేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఎన్నికలు వచ్చినప్పుడు తాను పోరాటం చేస్తానని కొన్ని గంటల ముందే దానం అన్నారు. సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వస్తానని తెలిపారు. దానంపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో అసెంబ్లీ నుంచి ఇంటికి వచ్చిన దానం రెండు గంటల పాటు లోపలే ఉన్నారు.
కాగా, 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ దానం బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజక వర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ మారిన ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసింది. చివరకు ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంలో మలుపులెన్నో


