తెలుగు ప్రజల పెట్టుబడులు.. రూ.2.95 లక్షల కోట్లు! | AP and TS Emerge as Important Contributors to Mutual Fund Growth | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల పెట్టుబడులు.. రూ.2.95 లక్షల కోట్లు!

Sep 19 2026 4:35 PM | Updated on Sep 19 2026 4:55 PM

AP and TS Emerge as Important Contributors to Mutual Fund Growth

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పెట్టుబడులపై అవగాహన బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, సిప్‌ల వైపు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తాజాగా విడుదలైన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు రూ.2.95 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఆస్తులను కలిగి ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్స్
జూలై 2026 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విలువ రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే ఇది దాదాపు 19 శాతం ఎక్కువ. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. తెలంగాణలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో దాదాపు 87 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. జూలై 2026 నాటికి రాష్ట్రంలో మ్యూచువల్ ఫండ్ AUM రూ.82,409 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విశాఖపట్నంలో సుమారు రూ.16,614 కోట్ల AUM ఉండగా, విజయవాడలో రూ.8,337 కోట్ల AUM ఉంది. దీన్నిబట్టి చూస్తే.. పెట్టుబడుల సంస్కృతి ఒక్క నగరానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని తెలుస్తోంది.

SIPకు పెరిగిన ఆదరణ
రెండు రాష్ట్రాల్లోనూ సిప్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. సిప్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా, ప్రతి నెలా మనకు సాధ్యమైనంత మొత్తాన్ని క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడం. తెలంగాణలో సిప్‌ల ద్వారా సుమారు రూ.47,975 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మొత్తం రూ.26,820 కోట్లు అని తెలుస్తోంది. అంటే ప్రజలు మార్కెట్ పరిస్థితులను ప్రతిరోజూ గమనించి పెట్టుబడులు పెట్టడం కంటే, క్రమంగా.. దీర్ఘకాలికంగా పెట్టుబడి చేయడానికి ఆసక్తి చూపుతున్నారని స్పష్టమవుతోంది.

ఇక పెట్టుబడిదారుల్లో మహిళలు కూడా భాగస్వాములవుతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పెట్టుబడిదారుల్లో సుమారు 24.42 శాతం మహిళలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 23.60 శాతంగా ఉంది. అంటే మహిళలు కూడా తమ పొదుపులను పెట్టుబడులుగా మార్చుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా ఈ పెట్టుబడుల పెరుగుదలకు ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది. 2025-26లో తెలంగాణ జీడీపీ సుమారు రూ.17.82 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ జీడీపీ సుమారు రూ.17.62 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ.. ప్రజల ఆదాయాలు, పొదుపులు, పెట్టుబడులపై అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రజల ఆసక్తి క్రమంగా పెరుగుతోందని స్పష్టంగా అర్థమైపోతోంది.

ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement