సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా.
ఈ నెల 23, 24వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం.. ఉందని పేర్కొంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ పలు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వర్షాలు మరింత పుంజుకొనున్నాయి.
నిన్న(శుక్రవారం) ఎండ తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నంద్యాల జిల్లా కొలివిుగుండ్లలో 5, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 4.8, కృష్ణాపురంలో 4.6, పెదబొడ్డేపల్లెలో 4.1, విజయనగరం జిల్లా కొత్తవలసలో 3.9, కాకినాడ జిల్లా రౌతులపూడిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి: బాబు కరువు.. ఊర్లకు ఊర్లు ఖాళీ


