ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలను ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మరోసారి తోసిపుచ్చారు. 2030 నాటికి AI కారణంగా ప్రపంచం అంతమవుతుందన్న వాదనతో తాను పూర్తిగా విభేదిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2030 నాటికి ప్రపంచం అంతమయ్యే అవకాశం లేదని, AI అభివృద్ధిని నిలిపివేయడం లేదా సమన్వయంతో నెమ్మదించడం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
AI పరిశ్రమ వీలైనంత వేగంగా ముందుకు సాగాలని హువాంగ్ అన్నారు. అయితే వేగం పెంచడం అంటే భద్రతను పక్కన పెట్టడం కాదని స్పష్టం చేశారు. ఉత్పత్తులు పూర్తిగా సిద్ధం కాకముందే లేదా భద్రతా ప్రమాణాలు నెరవేరకముందే వాటిని మార్కెట్లోకి తీసుకురాకూడదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో AI రంగంపై కొత్త నియంత్రణలు విధించాలన్న వాదనలపైనా ఆయన భిన్నమైన వైఖరిని వ్యక్తం చేస్తున్నారు.
హువాంగ్ వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలో AI భద్రతపై టెక్ పరిశ్రమలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ నెలలో ఆంత్రోపిక్ (Anthropic) పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేస్తూ, AI సంస్థలు స్వీయ అభివృద్ధి సామర్థ్యం కలిగిన సూపర్ఇంటెలిజెన్స్ వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయని, ఇది మానవాళికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చని హెచ్చరించారు. ఆయన ప్రకారం, AIని అభివృద్ధి చేస్తున్న కొందరు పరిశోధకులు ఈ దశాబ్దం ముగిసేలోపు అది మానవాళిని అంతం చేసే అవకాశం ఉందని నిజంగానే భావిస్తున్నారు.
కాక్సన్ వ్యాఖ్యలకు ఆంత్రోపిక్ అలైన్మెంట్ సైన్స్ లీడ్ ఇవాన్ హుబింగర్ కూడా స్పందించారు. AI వల్ల వచ్చే దశాబ్దంలోనే మానవాళి అంతరించే అవకాశం 10 శాతానికి పైగా ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, AI అభివృద్ధి వేగంపై పరిశ్రమలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ సహా పలువురు టెక్ దిగ్గజాలు అధునాతన AI అభివృద్ధిలో భద్రత, సమన్వయం, నియంత్రణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇటీవల మాజీ గూగుల్ డీప్మైండ్ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ కూడా AI ప్రమాదాలపై హెచ్చరికలు చేశారు.


