సాక్షి, హైదరాబాద్: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గోపన్పల్లిలో ఒక పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. భారీ యంత్రంలో భవనాన్ని హైడ్రా, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పురాతన భవనం కూల్చివేత ప్రభావంతో ఆ భవనం కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిన్న(శుక్రవారం) ఒక్కసారిగా బిల్డింగ్ పక్కకు ఒరిగిపోయింది. ఇవాళ(శనివారం) భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు.
గోపన్పల్లిలోని తాజ్నగర్లో 50 గజాల్లో నిర్మించిన ఓ నాలుగంతస్తుల భవనం అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగింది. దీంతో భవనంలో నివసిస్తున్నవారితో పాటు పక్కనున్న భవనంలోని వారు, బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఎంసీ, సర్కిల్, హైడ్రా అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనాన్నే కాకుండా, పక్కనే ఉండే మరో రెండు ఇళ్లవారిని కూడా ఖాళీ చేయించారు. తాజ్నగర్లో లక్ష్మి (దుబాయ్లో నివాసం) అనే మహిళ ఇక్కడ 50 గజాల్లో ఐదంతస్తుల భవనం నిర్మించారు.
ఒక్కో అంతస్తుకు రెండు గదుల చొప్పున మొత్తం పది గదులు భవనంలో ఉన్నాయి. దీన్ని బోరబండకు చెందిన మహ్మద్ అజహర్కు నెలకు రూ.75 వేలకు అద్దెకివ్వగా ఆయన హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఒక్కో రూములో ఇద్దరు నుంచి ఐదుగురు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం భవనం ఓ పక్కకు ఒరుగుతున్నట్లుగా గమనించి స్థానికులు, హాస్టల్లో ఉంటున్నవారు అజహర్కు సమాచారం అందించారు.
అతను భవనాన్ని పరిశీలించి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయమే ఆ భవనంలో అద్దెకు ఉండే వారందరినీ ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉండే మరో రెండు ఇళ్లలో నివాసం ఉండే వారిని కూడా ఖాళీ చేయించిన అధికారులు.. ఇవాళ కూల్చివేశారు.
ఇదీ చదవండి: దానం నాగేందర్ దారెటో?


